calender_icon.png 20 October, 2024 | 2:50 AM

గాంధీ.. ఉస్మానియా ఆస్పత్రుల గౌరవాన్ని పెంచుతాం

16-10-2024 01:22:09 AM

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌సిటీబ్యూరో, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాజధానిలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల గౌరవాన్ని మరింత పెంచుతామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం ఆయన మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించారు.

అనంతరం గర్ల్స్, బాయ్స్ నూతన హాస్టల్ భవనాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఐవీఎఫ్ సెంటర్ గురించి పట్టించకోలేదన్నారు. తాము ప్రత్యేక శ్రద్ధ వహించి ఐవీఎఫ్ సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఐవీఎఫ్ సేవలను వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాలకూ  విస్తరిస్తామన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటిసారి ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఐవీఎఫ్‌ను తీసుకొచ్చామన్నారు. ఈ మేరకు గాంధీ ఆస్పత్రిలో కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. గాంధీ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల సంఖ్య బాగానే ఉన్నప్పటికీ, విద్యార్థులు ఇబ్బందులు పడుతుండే వారన్నారు.

వారి కోసమే కొత్తగా హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా పాల్గొన్నారు.