calender_icon.png 28 October, 2024 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్లీకో దవాఖాన

28-10-2024 12:36:58 AM

  1. అర్హులైన వైద్యులు లేకున్నా జనరల్ ఆసుపత్రి, మల్టీ స్పెషాలిటీ బోర్డులు
  2. పరీక్షలు, స్కానింగ్‌ల పేరుతో పేదల జేబుకు చిల్లు
  3. గ్రామాల్లో శంకర్‌దాదా అవతారమెత్తిన ఆర్‌ఎంపీలు
  4. ఒకేరోజు 20 ఆస్పత్రులు సీజ్ చేసిన అధికారులు

వికారాబాద్, అక్టోబర్ (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలో గల్లీకో క్లినిక్, ఆసుపత్రి పుట్టుకొస్తోంది. కనీస అర్హత లేకపోయినా వైద్యుల అవతారం ఎత్తి ఆస్పత్రుల బోర్డులు తగిలించి వైద్యం అందిస్తున్నారు.

అమాక ప్రజలకు రక్త పరీక్షలు, స్కానింగ్ల పేర్లతో అందినకాడికి దోచుకుంటున్నారు. వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ వంటి పట్టణాల్లో దవాఖానాలు పట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. శనివారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టిన ఆకస్మిత తనిఖీలంతో నకిలీ వైద్యులు గుట్టు రట్టయింది.

శనివారం ఒక్కరోజే జిల్లాలో 20 నకిలీ క్లినిక్‌లను అధికారులు సీజ్ చేయడంతో పాటు నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఆర్‌ఎంపీ వైద్యులతో పాటు, ఎంబీబీఎస్ పేరు చెప్పుకొని వైద్యం అందిస్తున్న వాళ్లు ఉండటం గమనార్హం.  

మల్టీ స్పెషాలిటీ పేర్లతో..

ఏకంగా మల్టీ స్పెషాలిటీ పేర్లమీద  దవాఖానాలు నడిపిస్తున్నారు. ఆయా దవాఖా నాల్లో అసలు వైద్యులు ఎవరో తెలియడం లేదు. అక్కడ పనిచేస్తున్న వైద్యులు చదివించి ఒక కోర్సు అయితే మిగతా రోగాలకు కూడా వైద్యం అందిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఐసీయూ సెంటర్లు నడిపిస్తున్నారంటే ప్రైవేటు మాఫియా ఎంత సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

చిన్న వైద్యం కోసం పోయినా రక్త పరీక్షలు, స్కానింగ్‌ల పేర్లతో వేల రూపాయాలు దండుకుంటున్నారు. అవసరం లేక పోయి నా ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. మొత్తం ఫీజు చెల్లించకుంటే రోగిని బయటికి వదలడం లేదు. ఇటీవల జిల్లా కేంద్రం రైతు బజారు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ.30వేల బిల్లు చేయగా.. రూ.25 వేలు చెల్లిస్తామంటే నిర్వాహకులు ఒప్పుకోలేదు.

రోగం నయమైనా మూడు రోజులు ఆస్పత్రిలోనే పెట్టుకొని మొత్తం డబ్బులు చెల్లించాలకనే డిస్చార్జి చేశారు. ఇదిలా ఉండగా పరిగి కేంద్రంగా హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్ ఏకంగా అబార్షన్లు చేసి సొము ్మచేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఐదేళ్ల క్రితం ఈ ఆర్‌ఎంపీ చేసిన అబార్షన్ ఫెయిల్ కావడంతో ఓ యువతి మృతిచెందగా అప్పట్లో తీవ్ర దుమారమే రేగింది. మైనర్లు, ఇతర మహిళలు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసుకోవాలంటే ఈ సెంటర్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇలా ప్రతి ఆస్పత్రిలో ఇదే తంతు కొనసాగుతున్నా సంబంధిత అధి కారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.  

పేరు లేదు.. ఊరు లేదు

జిల్లాలో కొనసాగుతున్న అనేక ఆస్పత్రులకు ముందు పేరు ఉండటం లేదు. డాక్టర్ పేరు అసలే ఉండదు. అక్కడ ఏ డాక్టర్ ఉన్నారు..? ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే మీకు వైద్యం కావాలా డాక్టర్ వివరాలు కావాలా అన్న సమాధానం ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో అన్ని క్లినిక్‌లు వారంలో ఏదో ఒకరోజు మా ఆస్పత్రికి హైదరాబాద్ నుంచి స్పెషల్ డాక్టర్లు వస్తున్నారని ఊదరగొడుతున్నారు.

అయితే నిజానికి వాళ్లు రావడం లేదు. వాళ్ల పేరుచెప్పి స్థానిక డాక్టర్లే వైద్యం అందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వాళ్లు చదివిన చదువుకు చేస్తున్న వైద్యానికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ఇలా డబ్బు మోజులో పడి అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 

ఆర్‌ఎంపీల అండ ఉంటే..

ప్రైవేటు ఆస్పత్రుల మధ్య పోటీ వాతావరణం పెరగడంతో ఆర్‌ఎంపీల పంట పండుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఏ రోగమొచ్చినా... నొప్పివచ్చినా... ముం దుగా ఆర్‌ఎంపీ వద్దకే ఉరుకుతున్నారు. వాళ్లు ఏది చెబితే.. అదే నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్నే కొంతమంది ఆర్‌ఎంపీలు క్యాష్ చేసుకుంటున్నారు.

పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులు చాలావరకు ఆర్‌ఎంపీలనే నమ్ముకుంటున్నాయి. ఆర్‌ఎంపీలు తమ ఆసుపత్రులకు రిఫర్ చేస్తే.. వారికి పర్సంటేజీలు ఇచ్చే స్థాయికి ఆసుపత్రులు దిగజారాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నిచోట్లయితే ఆర్‌ఎంపీలే ఏకంగా క్లినిక్‌లు పెట్టి నడిపిస్తున్నారు.

మామూళ్ల మత్తులో అధికారులు..!

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మా మూళ్లమత్తులో మునిగి తేలుతుందనే విమర్శలు ఉన్నాయి. ఎలాంటి అర్హతలు, సర్టిఫికెట్లు లేకపోయినా ఏళ్లుగా క్లినిక్‌లు నడుతున్నారంటే వైద్య శాఖ అధికారుల అండదండలేననే విమర్శలు ఉన్నాయి. ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు నామమాత్రంగా తనిఖీలు చేతులు దులు పుకుంటున్నారు.

ఈ క్రమంలో శనివారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కౌన్సిల్ బృందాలు చేపట్టిన ఆకస్మిక తనిఖీలో జిల్లాలో ఏకంగా 20 అనుమతి లేని క్లినిక్‌లు ఉన్నట్లు గుర్తిం చారు. అందులో అర్హత లేని వైద్యు లు వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేశారు. ఇలా నిరంతరం దాడులు చేపట్టి నకిలీ ఆసుపత్రుల, వైద్యుల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.