02-04-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 1: (విజయక్రాంతి) : తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడు గద్దర్ అని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఈనెల 6న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రశ్నించే పాలకుల అణచివేత అంశంపై నిర్వహించే సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు సూర్యకిరణ్, ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ లతో కలసి ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ పై 1997 ఏప్రిల్ 6న కాల్పులు జరిపిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై ఎవరు కాల్పులు జరిపారో ప్రజా ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. 1997లో గద్దర్పై కాల్పులు జరిగాయని, కానీ కాల్పులు జరిపారో అప్పటి ప్రభుత్వాలు ఎవరు తేల్చలేదని పేర్కొన్నారు.
పీడిత ప్రజల వేదనను చూడలేక కాలమే గద్దర్ను కన్నదని ఉద్యమకారులు చెబుతారన్నారు. ఆయన పాటకు అంత శక్తి ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం నింపి, ప్రభుత్వాలను కదిలించిందన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం సాగించిన గద్దర్ ’ప్రజా యుద్ధనౌక’ అయ్యారని తెలిపారు.
మలి దశ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ఘనత గద్దర్కే దక్కిందన్నారు. తన పాటల ద్వారా ఎంతో మందిలో ఉత్తేజం కలిగించి, ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. పెద్దెత్తున గద్దర్ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్ వెంకట్ రెడ్డి, వినయ్ శంకర్, శ్రీరాములు, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.