calender_icon.png 25 February, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితుల సంక్షేమానికి నిధులు కేటాయించాలి

25-02-2025 12:00:00 AM

  • కుల దురహంకార దాడులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి

సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

అట్టహాసంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభ

పాల్వంచ, ఫిబ్రవరి 24 : ఆర్ధిక సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ వర్గాలు ఏకం కావాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభకు కూనంనేని ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడంతోపాటు దళితులపై దేశవ్యాప్తంగా నిత్యం జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన తర్వాత దళిత సంక్షేమానికి నిధుల కోత విధించడంతోపాటు దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగ భద్రత, దళితుల భద్రత, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు సన్నద్ధం కావాలన్నారు. దీర్ఘకాలిక సామాజిక ఉద్యమం ద్వారానే దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను సాధించుకోగలుగుతామని తెలిపారు.

దళిత కుటుంబాలు పరిమిత విద్య ద్వారా కొన్ని ఉద్యోగాలను పొందగలుగుతుండగా, ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వం ప్రైవేటీకరిం చడం ద్వారా ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.

సామాజికంగా గుర్తింపులేని దళితులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడమే సబ్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం కాగా, ప్రభుత్వం ఈ నిధులను దళితుల ప్రత్యేక కార్యక్రమాలకు వినియోగించకుండా సాధారణ కార్యక్రమాలకు మళ్లిస్తోందన్నారు. అసైన్డ్ భూములు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇచ్చినవేనని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు బిసి, ఎస్సి, ఎస్టి, పేద ఆసైన్డ్ రైతులకు మేలు జరిగేలా చూడాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో %ఐ% సాబీర్ పాషా, దళిత హక్కుల పోరాట సమితి రాష్ర్ట అధ్యక్ష కార్యదర్శులు కె. ఏసురత్నం, మరుపాక అనిల్ కుమార్, రైతు సంఘాల జిల్లా కార్యదర్శి, ముత్యాల విశ్వనాథం, డిహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్, జిల్లా నాయకులు కంచర్ల జమలయ్య, బండి నాగేశ్వరరావు, కె రత్నకుమారి, పేరాల శీను, చెన్నయ్య, మామిడాల ధనలక్ష్మి, జకరయ్య, సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు.