calender_icon.png 20 September, 2024 | 5:23 AM

స్కిల్ వర్సిటీకి నిధులివ్వండి

20-09-2024 02:50:36 AM

నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుచేద్దాం

  1. వర్సిటీలో పారిశ్రామికవేత్తలదే కీలక పాత్ర
  2. ప్రభుత్వం నుంచి వర్సిటీకి రూ.100 కోట్లు
  3. క్రీడా వర్సిటీకి వెయ్యికోట్లయినా భరిస్తాం
  4. స్కిల్ వర్సిటీ గవర్నింగ్ బోర్డు సభ్యులు.. పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
  5. సమావేశంలో ఏపీ సీఎం కోడలు నారా బ్రాహ్మణి

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిది ద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వాములు కావాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతోపాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి సచివాల యంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతోపాటు రూ.100 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుతోపాటు యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. కంపెనీల పేర్లను లేదా దాతల పేర్లను ఈ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు. 

క్రీడా వర్సిటీకి వెయ్యి కోట్లయినా సిద్ధం

వీలైనంత వేగంగా తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చామని, ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ రంగంలో అనుభవంతోపాటు ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆనంద్ మహీంద్రా స్కిల్ యూనివర్సిటీకి తన బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారనే నమ్మకం ఉందని దీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని చెప్పారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పి..

2028 ఒలంపిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామని తెలిపారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల ఇబ్బంది లేదని, రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.1000 కోట్లు ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆర్థిక సహకారానికి మించి రాష్ట్రంలోని అందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్యవేత్తలు ఆశించినంత చొరవ ప్రదర్శించాలని, తగిన భాగస్వామ్యం, బాధ్యతలను పంచుకోవాలని కోరారు. 

పట్టాలు కాదు.. ఉద్యోగాలు కావాలి

డిగ్రీలు, పీజీ పట్టాలు ఉంటే సరిపోదని, ఇంజినీరింగ్ పూర్తిచేసిన లక్షలాది మంది యువకులు ఒక ఉద్యోగం ఇప్పించండని తన వద్దకు వస్తున్నారని సీఎం తెలిపారు. ఏటా లక్షలాది మంది యువత డిగ్రీలు, పీజీలు, ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నారని, కానీ అందరూ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని అన్నారు. మరోవైపు పరిశ్రమల అవసరాలకు సరిపడే మానవ వనరుల కొరత ఉందని చెప్పారు. ఈ అంతరాన్ని పూడ్చేందుకు స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పాలనే ఆలోచన చేసినట్టు తెలిపారు. అందరికీ సరిపడా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవని, వివిధ రంగాలతోపాటు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే యువత ఉపాధికి ఢోకా ఉండదని చెప్పారు. 

ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకే: మంత్రి శ్రీధర్‌బాబు

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు వివరించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా కొత్తగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పుతుంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి స్వీయ ఆలోచనలతో త్వరలోనే స్కిల్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభమవటం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

వచ్చే నెల నుంచే కోర్సులు

కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత అక్టోబర్‌లో కోర్సులను ప్రారంభించనున్నట్టు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా తాత్కాళికంగా కోర్సులను నిర్వహించనుంది. ముందుగా హెల్త్‌కేర్, ఈబీకామర్స్ అండ్ లాజిస్టిక్స్ కోర్సులను ప్రారంభించనుంది. ఈ కోర్సుల నిర్వహణకు అపోలోతోపాటు ఏఐజీ, లెన్స్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, అల్కార్గో, ప్రొ కనెక్ట్, ఓ9 సొల్యూషన్స్ కంపెనీలు ముందుకొచ్చాయి. తొలి ఏడాది రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ సమావేశంలో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీని రాజు, బోర్డు సభ్యులు పీ దేవయ్య, సుచిత్ర ఎల్లా, సతీష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజిత్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బోర్డు సభ్యులు మనీష్ సభర్వాల్, సంజీవ్ బిక్చందానీ, ఎంఎం మురుగప్పన్, డాక్టర్ కేపీ కృష్ణన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. 

సమావేశంలో నారా బ్రాహ్మణి

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు మీటింగ్‌లో సీఎం, మంత్రులు, సీఎస్, బోర్డు చైర్మన్, సభ్యులతోపాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. సమావేశంలో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు పాల్గొన్న నేపథ్యంలో నారా బ్రాహ్మణి కూడా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తరఫున హాజరైనట్టు తెలిస్తుంది. నారా బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే తెలంగాణలో ఏర్పాటు చేయబోయే స్కిల్ వర్సిటీపై చర్చల్లో భాగంగా నారా బ్రాహ్మణి పాల్గొనడం ఆసక్తిగా మారింది. 

విజన్ ఉన్న సమర్థుడు రేవంత్: ఆనంద్ మహీంద్రా

తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన గొప్పదని యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. మంచి విజన్ ఉన్న సమర్థ నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అని కొనియాడారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని కోరగానే ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు. సాధారణంగా ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచించిన తీరులోనే దార్శనికత ఉందని అభినందించారు. తెలంగాణలోనే అతి పెద్ద యూఎస్ కాన్సులేట్ ఉందని, ఎక్కువ మంది ఇక్కడి నుంచే అమెరికాకు వెళ్తున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబడుతుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. సీఎం కల నిజం కావాలని, ఆయన ఆశయం నెరవేరాని ఆకాంక్షించారు.