calender_icon.png 2 October, 2024 | 7:57 PM

షోరూంల్లో బిల్లుకట్టి.. బ్యాంకును మోసం చేసి..

10-09-2024 04:42:30 AM

  1. యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ముఠా 
  2. 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): శేరిలిం గంపల్లి: బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో వస్తువులు కొని.. తర్వాత ఆ వస్తువులను వేరే వారికి అమ్మేసి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను ఆదివారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ డీసీపీ నరసింహ తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన ఒక ముఠా రాష్ట్ర వ్యాప్తంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రూ.4 కోట్ల మేర యూపీఐ మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. వారి నుంచి రూ.50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, రూ.1.62 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. నిందితులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని షోరూంలతో పాటు రాష్ట్రంలోని ఏదేని ఒక ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌కు వెళ్లి అక్కడ వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఆ సందర్భంలో బిల్లు చెల్లించేందుకు రాజస్థాన్‌లోని ముఠా సభ్యుడికి షోరూమ్‌లోని క్యూర్ కోడ్‌ను పంపిస్తారు. దీంతో ఆ వ్యక్తి షోరూమ్‌కు యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తాడు. వస్తువులు కొన్న వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లి వాటిని అమ్మేస్తారు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని సదరు వ్యక్తి బ్యాంకుకు వెళ్లి పొరపాటున డబ్బును బదిలీ చేశానంటూ ఫిర్యాదు చేసి బ్యాంకు ద్వారా ఆ డబ్బును  తిరిగి పొందుతాడు. నిందితులు ఇలా రెండు నెలలుగా 1,125 యూపీఐ లావాదేవీలను జరిపినట్లు పోలీసులు గుర్తించా రు. కాగా, బజాజ్ ఎలక్ట్రానిక్స్ బాధ్యుల ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టి రాజస్థాన్‌కు చెందిన 13 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ చెప్పారు. ప్రధాన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.