- 200 మంది నుంచి రూ.20 కోట్లు వసూలు
- సైబరాబాద్ ఈఓడబ్ల్యూను ఆశ్రయించిన బాధితులు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (విజయక్రాంతి): మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటామని బరితెగిస్తున్నారు నేరగాళ్లు. అధిక వడ్డీ ఆశ చూపి కొందరు.. చిట్టీల పేరుతో మరికొందరు అమాయకపు ప్రజలకు వల విసురుతు న్నారు. రూ.కోట్లు సేకరించి పరారవుతున్నారు.
తాజాగా హైదరాబాద్లో మరో మోసం వెలుగు చూసింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్కు చెందిన మామాఅల్లుళ్లు చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాలు.. చింతల్లోని శ్రీసాయి కాలనీలో నివాసం ఉంటున్న సీతారామయ్య, అతడికి వరుసకు అల్లుడయ్యే మురళితో కలిసి చిట్టీల పేరుతో సుమారు 200 మంది నుంచి రూ. 20 కోట్ల మేర డబ్బులు వసూలు చేశారు.
అనంతరం పరారయ్యారు. చిట్టీ డబ్బుల కోసం బాధితులు లబోదిబోమన్నారు. రూపాయి రూపాయి పోగు చేసుకుని చిట్టీలు కట్టామని, ఇప్పుడు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా సీతారామయ్య, అతని అల్లుడు పారిపోయారన్నా రు. వారి ఫిర్యాదు మేరకు ఈఓడబ్ల్యూ కేసు నమోదు చేసింది.