12-02-2025 12:34:23 AM
దుబ్బాక మాజీ కౌన్సిలర్ ఆశ యాదగిరి
దుబ్బాక /సిద్దిపేట, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు. కుల గణనలో వివరాలు తీసుకున్నరు. గ్రామ సభల పేరిట డ్రామా చేశారు. ఇప్పుడు మల్లా మీసేవలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని దుబ్బాక మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆశ యాదగిరి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దరఖాస్తుల పేరుతో ప్రభుత్వం ప్రజలను దగా చేస్తుందని మండిపడ్డారు.
పథకాల పేరిట ఇన్నాళ్లు ప్రభుత్వం చేసిన హడావుడి, స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీగా ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. ప్రజా పాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా అంటూ ప్రశ్నించారు. బిఆర్ఎస్ పాలనలో దరఖాస్తు, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగాయని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారు. జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, పేదలకు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
దరఖాస్తుల పేరిట కాలం వెళ్లదీయడం మానేసి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి, నిరుపేదలకు, రైతులకు ప్రభుత్వం బాసటగా నిలవాలని కోరారు.