30-03-2025 06:18:37 PM
పండుగ పూట కామారెడ్డి జిల్లాలో విషాదం..
ప్రమాదవశాత్తు ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు పినతల్లితో పాటు ముగ్గురు పిల్లలు మృత్యువాత పడడం వెంకటాపూర్ గ్రామంలో కలకలం రేపుతుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ పెద్ద చెరువు సమీపంలో ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటన తీవ్రవిషాదాన్ని నింపింది. స్థానికులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన బోమ్మర్ది లక్ష్మయ్య కుమారుడు లింగయ్యకు మొదటి భార్య అనారోగ్యంతో గత కొంతకాలం క్రితం మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
భార్య మృతి చెందడంతో లింగయ్య రెండో పెళ్లి మౌనికను పెళ్లి చేసుకున్నాడు. ఉగాది పండుగకు హాస్టల్లో ఉన్న ముగ్గురు పిల్లలు వెంకటాపూర్ కు వచ్చారు. మౌనిక (26) పినతల్లి వారి పిల్లలు మైథిలి (10) అక్షర (9) వినయ్(7) లతో కలిసి శనివారం మధ్యాహ్నం చెరువు వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్ళింది. పిల్లలు నీటిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఆమె బట్టలు ఉతుకుతున్న క్రమంలో పిల్లలు స్నానానికి ఆడుకుంటూ లోనికి వెళ్లడంతో గుంతలో చిక్కుకొని గల్లంతయ్యారు. వారిని గమనించిన పినతల్లి మౌనిక వారిని కాపాడేందుకు ప్రయత్నించి ఆమె కూడా గుంతలో చిక్కుకొని మృతి చెందింది.
సాయంత్రం అయినా కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా శనివారం అర్ధరాత్రి వినయ్ మృతదేహం చెరువులో తేలడంతో కుటుంబ సభ్యులు గుర్తించారు. చెరువు ఒడ్డున దుస్తులు కనిపించడంతో వెతకడం ప్రారంభించారు. అర్ధరాత్రి వినయ్ మృతదేహం లభించగా ఆదివారం ఉదయం వరకు మరో ముగ్గురు మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తీవ్రవిషాదాన్ని నింపింది. నలుగురు మృతదేహాలను ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఉగాది పండుగ పూట ఈ ఘటన వెలుగులోకి రావడంతో వెంకటాపూర్ లో తీవ్రవిషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడం ఈ ఘటన తీవ్రంగా గ్రామస్తులను కలచివేసింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ సంఘటన స్థలానికి వెళ్లి గ్రామస్తులను బాధిత కుటుంబాలని పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ. 5,000 లు ఆర్థిక సాయం అందించారు. ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.