11-02-2025 11:27:51 PM
ఈ నెల 17 వరకు ఆఖరి గడువు...
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): జీహెచ్ఎంసీలో ఈ నెల 25న జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికకు మంగళవారం నాటికి నలుగురు కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేసినట్టు రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 10 నుంచి 17 వరకూ నామినేషన్లకు గడువు ఉండగా, 10వ తేదీ సోమవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాగా, మంగళవారం మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ల పత్రాలను ఆర్ఓకు అందజేశారు. మొత్తం 15 మంది సభ్యులను ఎన్నుకోవడానికి అవకాశం ఉండగా, బల్దియాలో రాజకీయ పరిణామాలు మార్పులు, చేర్పులతో ఆఖరి ఏడాది స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఉత్కంఠభరితంగా ఉంటుందని పలు పార్టీలు భావిస్తున్నాయి. మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బూరుగడ్డ పుష్ప (రామచంద్రాపురం), మహాలక్ష్మీ రామన్ గౌడ్ (హిమాయత్ నగర్), బీఆర్ఎస్ పార్టీ నుంచి జూపలి సత్యానారాయణ (కూకట్పల్లి), ప్రసన్న లక్ష్మీ (అడ్డగుట్ట) ఉన్నారు.