calender_icon.png 14 October, 2024 | 12:25 AM

రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

13-10-2024 10:33:36 PM

పలు కుటుంబాల్లో విషాదం నింపిన పండుగ

ఆదిలాబాద్/నాగర్‌కర్నూల్/జనగామ/కూసుమంచి,(విజయక్రాంతి): నాలుగు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. నాగర్‌కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన దినసరి కూలీలు 13మంది పత్తి తీయడం కోసం సరస్వతీ ఆలయ సమీపంలో ప్రధాన రహదారి నుంచి పంట పొలాలకు మినీవ్యాన్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలో అదుపుతప్పి కాల్వలోకి ఫల్టీ కొట్టింది. దీంతో అందులో ప్రయానిస్తున్న మహ్మద్ బేగం(45) అక్కడికక్కడే మృతిచెందగా మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. జనరల్ ఆసుపత్రికి తరలించగా వారిని స్థానిక ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడికే గ్రామానికి చెందిన నోముల రవీందర్‌రెడ్డి(27) నల్లగొండ జిల్లాలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాడు. తన తండ్రి రెండో సంవత్సరం పిండ ప్రదానం కోసం ఆదివారం తెల్లవారుజామున నల్లగొండ నుంచి కారులో తన స్వగ్రామానికి బయలుదేరాడు.

జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వడిచెర్ల గ్రామంలో కారు అదుపుతప్పి డ్రైనేజీని ఢీకొట్టడంతో రవీందర్‌రెడ్డి మృతిచెందాడు. ఖమ్మం కస్బా బజార్‌కు చెందిన  సయ్యద్ మోహినుద్దీన్ కుటుంబం హైదరాబాద్ వెళ్లి ఆదివారం తిరిగి ఖమ్మం కారులో బయలుదేరారు. కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామ సమీపంలో డ్రైవర్ వేగంగా, అజాగ్రత్తతో కారును నడపడంతో అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. దీంతో మోహినుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందగా, నూర్జహాన్, ఎం.ఏ మహ్మద్ ఖాన్, డ్రైవర్‌కు తీవ్ర గాయలయ్యాయి. ఆదిలాబాద్‌లోని భాగ్యనగర్ కాలనీకి చెందిన జితేష్, అనిల్, నాగరాజ్ ఆదివారం తెల్లవారుజామున బైక్‌పై గుడిహత్నూర్ నుంచి అదిలాబాద్ వైపు వెళ్తున్నారు. మావల వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొనడంతో జితేష్ మృతిచెందాడు. నాగరాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.