calender_icon.png 6 October, 2024 | 4:01 PM

48 పెరిగిన ఎఫ్‌డీఐ

04-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 47.8 శాతం పెరిగి 16.17 బిలియన్ డాలర్లకు చేరాయి. మంగళవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సర్వీసులు, కంప్యూటర్, టెలికాం, ఫార్మా రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. నిరుడు ఇదేకాలం లో దేశం 10.94 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. ఈ ఏడాది మే నెలలో ఎఫ్‌డీఐలు 2.67 బిలియన్ డాలర్ల నుంచి 5.85 బిలియన్ డాలర్లకు, జూన్‌లో 3.16 బిలియన్ డాలర్ల నుంచి 5.41 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

ఏప్రిల్ నెలలో మాత్రం నిరుడుతో పోలిస్తే 5.1 బిలియన్ డాలర్ల నుంచి 4.91 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఈక్విటీ పెట్టుబడులు, ఇతర మూలధనంతో కలిపితే మొత్తం ఎఫ్‌డీఐలు 28 శాతం వృద్ధిచెంది 22.49 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గణాంకా లు వెల్లడించాయి. మారిషస్, సింగపూర్, యూఎస్, యూఏఈ నుంచి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఎఫ్‌డీఐలు అధికంగా పొందిన రాష్ట్రాల్లో 8.48 బిలియన్ డాలర్లతో మహారాష్ట్ర అగ్రస్థానం లో ఉన్నది. కర్నాటక (2.28 బిలియన్లు), తెలంగాణ (1.08 బిలియన్లు), గుజరాత్ (1.02 బిలియన్లు) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.