calender_icon.png 22 October, 2024 | 11:11 PM

పోలీసు అధికారిగా నేను ఎలాంటి తప్పు చేయలే: ప్రభాకర్ రావు

11-07-2024 12:06:48 PM

హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ ఛీప్ ప్రభాకర్ రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతనెల 23న జూబ్లీహిల్స్ పోలీసులకు ప్రభాకర్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రభాకర్ రావు తెలిపారు. జూన్ 26న తాను భారత్ కు రావాల్సిఉందన్న ఆయన ఆరోగ్యం బాగాలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నానని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. అమెరికా వైద్యుల సూచనతో ఇక్కడే చికిత్స పొందుతున్నానని తెలిపారు.

తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని వాపోయాడు. పోలీసు అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. తాను తన కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. టెలీకాన్ఫరెన్స్, మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. తాను క్రమశిక్షణ గల అధికారిని.. విచారణ ఎదుర్కుంటానని స్పష్టం చేశారు. తాను ఎక్కడికీ తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదన్నారు. తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత భారత్ కు వస్తానని చెప్పారు. గతంలోనూ పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని చెప్పానన్న ఆయన తన దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణాధికారికి చెబుతానని వెల్లడించారు.