12-02-2025 01:27:26 AM
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఓ మాజీ మండల స్థాయి ప్రజా ప్రతినిధి పుట్టినరోజు సందర్భంగా ప్రాథమిక స్థాయి విద్యార్థుల చేత బలవంతంగా ఎండలోనే నిల్చోబెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పెద్దకొత్తపల్లి మండలం చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి పుట్టినరోజు సందర్భంగా మరికల్ గ్రామంలోని కార్యకర్తలు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల చేత బలవంతంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించారు.
మొదట పేరు పలికి పుట్టినరోజు చెప్పినప్పటికీ వారికి నచ్చిన విధానంలోనే చెప్పాలని ఎక్కువ సేపు ఎండలో నిల్చబెట్టడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై డిఇఓ రమేష్ కుమార్ వివరణ ఇస్తూ ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోవాలని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.