21-02-2025 11:12:57 PM
మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్...
హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మళ్ళీ పాత రోజులు వచ్చాయని, సాగు, తాగు నీరుకు మళ్ళీ కటకట లాడే పరిస్థితి వచ్చిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కథమళ్ళీ మొదటి కొచ్చిందని, కేంద్రం అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ నివేదికలే కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన విషయం చెబుతున్నాయన్నారు. పాలమూరులో పద్నాలుగు నెలల్లో ఒక్క ఎకరాకు అయినా నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ఢిల్లీకి అఖిల పక్షం తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.