07-03-2025 12:00:00 AM
మృతదేహాన్ని దేశానికి రప్పించేందుకు చర్యలు
షాద్ నగర్, మార్చి6 (విజయక్రాంతి) ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్ళిన కేశంపేట మండలం గంప రాఘవులు కుమారుడు గంప ప్రవీణ్ ను దుండగులు హతమార్చడం పట్ల మాజీ మంత్రి కే. తారకరామారావు, కేశంపేట మండలం మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్ యాదవ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురువారం సాయంత్రం వై. రవీందర్ యాదవ్ కేశంపేట మండల కేంద్రంలోని గంప రాఘవులు స్వగృహంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అమెరికాలో హత్యకు గురైన రాఘవులు కుమారుడు గంప ప్రవీణ్ మృతి చాలా బాధాకరమని కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ స్థానిక నేత రవీందర్ యాదవ్ కు ఫోన్ ద్వారా స్పందించి బాధితుడు రాఘవులుతో ఫోన్లో మాట్లాడారు.
జరిగిన దారుణం చాలా బాధాకరమని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ధైర్యంగా ఉండాలని, గంప ప్రవీణ్ మృతదేహాన్ని వీలైనంత తొందరగా భారతదేశానికి రప్పించేందుకు భారత రాయబార సంస్థతో మాట్లాడతానని చెప్పారు. పూర్తి వివరాలు మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ కు అందజేయాలని మంత్రి కేటీఆర్ గంప ప్రవీణ్ తండ్రి రాఘవులతో ఫోన్లో చెప్పారు.