మల్కాపూర్ కూల్చివేతలో గాయపడ్డ హోంగార్డు గోపాల్ ని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా కూల్చివేతలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోం గార్డ్ గోపాల్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కొత్తకాపు శ్రీధర్ రెడ్డి తదితరులు ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీస్ ఉన్నతాధికారి కూడా వచ్చి పరామర్శించలేదన్నారు. ఇప్పటి వరకు హోం గార్డ్ గోపాల్ కుటుంబం చికిత్సకి లక్ష రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదు.ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
నాలుగు నెలల నుండి జీతం రాక, ఇటు వైద్య ఖర్చులు భరించలేక పోతున్నాం అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తలకు దెబ్బ తగిలి మాట పడిపోయింది. పూర్తిగా మాటలు రావడానికి నాలుగు నెలల పాటు స్పీచ్ థెరఫీ అందించాలని డాక్టర్లు చెప్తున్నారు.ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్ళు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ ప్రమాదానికి గురి అయ్యారు.ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గోపాల్ ని, గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గోపాల్ కి పూర్తిగా నయం అయ్యేంత వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని, అలాగే గోపాల్ కి పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.