calender_icon.png 2 October, 2024 | 11:55 AM

ఫార్మా కంపెనీల ఏర్పాటును ఉపసంహరించుకోవాలి

10-09-2024 04:36:11 AM

  1. వ్యవసాయ భూముల సేకరణతో రైతులకు నష్టం 
  2. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా.. పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్‌రావు

సంగారెడ్డి, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): న్యాల్‌కల్ మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణి క్‌రావు డిమాండ్ చేశారు. వ్యవసాయ భూముల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే రైతులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట న్యాల్‌కల్ మండలం డప్పూర్, మల్గి, వడ్డి గ్రామాల ప్రజలు, రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. న్యాల్‌కల్ మండలంలో 2003 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని..  ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు రైతులకు మద్దతుగా ఉంటామని తెలిపారు.

రైతుల అభిప్రాయాలు తీసుకోకుండానే ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. కంపెనీల ఏర్పాటును రద్దుచేసే వరకు ఆందోళన చేస్తామని వెల్లడించారు. ధర్నాకు బీఆర్‌ఎస్, సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆందోళనకారుల వద్దకు వచ్చి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. ధర్నాలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ పాల్గొన్నారు.