12-03-2025 06:34:41 PM
కాటారం,(విజయక్రాంతి): వన్యప్రాణులను సంరక్షించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, విధానాలపై అటవీశాఖ అవగాహన సదస్సును నిర్వహించింది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకానిలో ఈ సదస్సు నిర్వహించారు. పులి సంచారం చేస్తున్న నేపథ్యంలో.. పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దని కాటారం రేంజి అటవీ శాఖ క్షేత్రాధికారి జాడి స్వాతి సూచించారు. వేసవికాలం దృష్ట్యా అడవుల్లోని జంతువులు దాహార్తి తీర్చుకునేందుకై ఊరి శివారులలో గల వాగులు, చెలిమలు వద్దకు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్న నేపథ్యంలో వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని అటవీ అధికారులు కోరారు. అటవీ ప్రాంతంలోని జంతువులకు దాహార్తిని తీర్చేందుకు హోల్స్, సాసర్ పిట్లలో నీటిని నింపేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అటవీ సమీప ప్రాంతాల్లో గ్రామపంచాయతీ ట్రాక్టర్ల ద్వారా నీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు ఉచ్చులను, కరెంటు వైర్లను వాడకుండా ఉండేందుకు అవగాహన కల్పించారు. వన్యప్రాణులను వేటాడుట చట్టరీత్యా నేరం అనే అంశాలపై సోదాహరణంగా వివరించారు. వేసవికాలం దృష్ట్యా అడవుల్లో నిప్పు రాజుకోకుండా ఉండడంతోపాటు, పశువుల కాపర్లు, గోర్లు, బర్ల కాపర్లు.. నిప్పు రవ్వలను అడవుల్లో వేయకుండా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చింతకాని ఇంచార్జీ డిప్యూటీ రేంజర్ జె శ్రీనివాస్, కాటారం డిప్యూటీ రేంజర్ హెచ్ సురేందర్ నాయక్, ఎఫ్ బీ ఓ ఏ అశోక్, ఎఫ్ బీ ఓ ఎం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.