09-02-2025 01:18:10 AM
* అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి
* కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకానికి తూట్లు
* విదేశీ విద్యార్థుల జూమ్ మీటింగ్లో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్యను దూరం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎంపికై వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో శనివారం ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో కవిత మాట్లాడారు. దాదాపు 200 మంది విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొనగా ఆమె మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో సదుద్దేశం తో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
పేద విద్యార్థులకు కూడా విదేశీ విద్య అందాలన్నది కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం ఉద్దేశాలకు తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. రెండో విడత నిధులను ఎందుకు విడుదల చేయడం లేదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ మాత్రమే కాకుండా ఇతర స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు.