22-03-2025 01:28:43 AM
రూ. మూడు లక్షల విలువైన ఉత్పత్తుల సీజ్
మేడ్చల్, మార్చి 21(విజయ క్రాంతి): మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా, షామీర్పేటలోని లోని సూర్య మసాలా తయారీ ఇండస్ట్రీలో, రెస్టారెంట్లలో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు లోపాలు బయటపడ్డాయి. అపరిశుభ్ర వాతావరణంలో మసాలాలు, పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
వీటిని నిల్వచేసిన డబ్బాలలో ఫంగస్ వచ్చింది. ఎండుమిర్చి, కొబ్బరి పొడి పురుగులు పట్టి ఉన్నాయి. రికార్డుల నిర్వహణ కూడా సరిగా లేదు. 46.75 క్వింటాళ్ల పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు సీజ్ చేసి, నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. మురికిగా ఉన్న కంటైనర్లు, ఫంగస్ ఉన్న పదార్థాలు, తయారీ తేదీ లేని వాటిని, అధిక దుర్వాసన ఉన్న ఉత్పత్తులను ధ్వంసం చేశారు.
సంబంధిత సంస్థకు నోటీసులు జారీ చేశారు. ల్యాబ్ రిపోర్టులో కల్తీ అని తేలితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. రెస్టారెంట్లో దుమ్ము ధూళి, ఈగలతో కూడిన వండిన ఆహార పదార్థాలను, పలుమార్లు వేడి చేసిన వంట నూనెను ఆహార పదార్థాలలో వాడటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ ఎస్ ఎస్ ఏ సెక్షన్ల కింద యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే సీజ్ చేస్తామని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి జ్యోతిర్మయి స్పష్టం చేశారు. తనిఖీలలో టాస్క్ ఫోర్స్ స్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు రోహిత్, శ్రీషిక, స్వాతి, జగన్నాథ్ పాల్గొన్నారు