సుమారు 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
ఎవరికి తెలియకుండా ట్రీట్మెంట్
తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వని సిబ్బంది
తల్లిదండ్రుల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయని కాలేజీ నిర్వాహకులు
శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): మాదాపూర్ కావూరి హిల్స్ శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే వారిని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు వైద్యులు చెప్పడంతో గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకుడు నవీన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫుడ్ పాయిజన్ అయినట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, కాలేజీ సిబ్బంది వాళ్ల ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆరోపించారు. బాధిత విద్యార్థులకు తక్షణమే మెరుగైన చికిత్స అందివ్వకపోతే కాలేజీ ముందు ఆందోళనకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, చైతన్య కాలేజీలో ఇలాంటి ఘటనలు మామూలయ్యాయని, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాలేదని, వర్షాల నేపథ్యంలో వైరల్ ఫీవర్ తో పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయని తెలిపారు.