calender_icon.png 2 April, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాస పథకం అమలుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించండి

01-04-2025 12:01:55 AM

 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 

 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష 

 పాల్గొన్న పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీ.ఎస్ శాంతికుమారి 

నిజామాబాద్, మార్చి 31 : (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ పథకం కింద వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా నిరుద్యోగ యువతకు వారు ఎంపిక చేసుకునే రంగాలలో స్వయం ఉపాధి పొందేందుకు ఆస్కారం కలుగుతుందని, నిరుద్యోగ సమస్యకు చాలావరకు పరిష్కార మార్గం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువత స్వయం ఉపాధిని ఎంచుకుని ఆర్ధిక పరిపుష్టి సాధించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. 

ఈసారి మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికి రాజీవ్ యువ వికాసం కింద స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ పథకం కింద రాయితీ రూపంలోనే కనీసం రూ. 10 వేల కోట్లను వెచ్చించాలని ప్రభుత్వం సంకల్పించింది స్పష్టం చేశారు. ్రఈ పథకం అమలు తీరుపై నిశిత పర్యవేక్షణ జరపాలని కలెక్టర్లకు సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్దిదారులకు ఆయా యూనిట్ల స్థాపన కోసం 50 వేల రూపాయల లోపు రుణానికి వంద శాతం రాయితీ, లక్ష రూపాయల లోపు రుణానికి 90 శాతం మాఫీ, లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ, 2లక్షల రూపాయల నుంచి రూ.4 లక్షల వరకు రుణానికి 70 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు.

రాయితీని మినహాయిస్తూ, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా లోన్ల రూపంలో ఆర్ధిక సహాయాన్ని కల్పిస్తామన్నారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలని, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల లోపు ఉండాలన్నారు. నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్న మీదట, సంబంధిత పత్రాలన్నింటినీ వారివారి ప్రాంతాలలోని మున్సిపల్ కార్యాలయం లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పథకానికి వీలైనంత ఎక్కువమంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పలుమార్లు పత్రికా ప్రకటనలు విడుదల చేసి విస్తృత ప్రచారం కల్పించామని అన్నారు. ఈ పథకానికి దరఖాస్తులు చేసుకునే వారికి ఇబ్బంది కలుగకుండా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెంటదివెంట జారీ చేయాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించామన్నారు. అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పథకం ప్రాధాన్యతను, అమలు తీరులో చేపట్టాల్సిన చర్యల గురించి మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు.

వచ్చిన దరఖాస్తులను నిశిత పరిశీలన జరిపి, అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసేలా మున్సిపల్, మండల స్థాయిలలో సంబంధిత అధికారులతో కూడిన ఎంపిక కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల వివరాల గురించి కలెక్టర్ తెలియజేశారు.వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్, డీబీసీడీఓ స్రవంతి, డీటీడబ్ల్యుఓ నాగూరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.