calender_icon.png 27 October, 2024 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కిల్ వర్సిటీపై ఫోకస్

09-07-2024 01:04:48 AM

ఈఎస్‌సీ ప్రాంగణంలోనే స్కిల్ వర్సిటీ!

సాధ్యమైనంత త్వరగా ప్రతిపాదనలివ్వండి 

అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

ఐఎస్‌బీ తరహాలో వర్సిటీకి బోర్డు ఏర్పాటు

పారిశ్రామిక వేత్తలతో సీఎం, డిప్యూటీ సీఎం సమావేశం

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): రాష్ర్టంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఒకటీ రెండు రోజుల ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతోపాటు పారిశ్రామిక రంగ ప్రముఖు లకు సూచించారు. వాటిని పరిశీలించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.

వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో ముఖ్యమంత్రి సోమవారం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ (ఈఎస్‌సీ)లో సమావేశం అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అటు ఐటీ కంపెనీలతోపాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున దీని ప్రాంగణంలోనే వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారు. ఐఎస్‌బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చర్చించారు. అప్పటివరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 

యువతకు ఉద్యోగావకాశాలే లక్ష్యం 

స్కిల్ యూనివర్సిటీలో ఏమేం కోర్సులుండాలి, ఎలాంటి కరిక్యులమ్ ఉండాలి.. పరిశ్ర మల అవసరాలు తెలుసుకొని, వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికే లా ఏయే నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలనేది ముందుగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అధునాతన పరిజ్ఞానం అందించేలా ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని సూచించారు.

నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, 15 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున ప్రతీ 5 రోజులకోసారి సమావేశం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా? ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలా? మరేదైన విధానం అనుసరించాలా? అనేది కూడా పరిశీలించాలని ఆదేశించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని సూచించారు.

యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్టుమెంట్‌గా ఉంటుందని ప్రకటించారు. సమా వేశానికి ముందు ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇరవై నిమిషాలపాటు కలియతిరిగారు. ఈ సమావేశంలో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, భారత్ బయోటెక్ హరిప్రసాద్, క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్‌రెడ్డి, ఐ ల్యాబ్స్ శ్రీనిరాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.