03-03-2025 06:02:52 PM
నగర రహదారులపై మరింత సురక్షితంగా పాదచారుల రాకపోకలు..
ప్రతి మెట్రో స్టేషన్... సురక్షితంగా రోడ్డు దాటే పైవంతెనలే..
పైవంతెనల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామన్న మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి...
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో జటిలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలకు కొంతవరకు పరిష్కారంగా, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా ప్రైవేట్ వాహనాలు సంఖ్యను తగ్గించడానికి ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా మెట్రో స్టేషన్ల నుండి వాటి సమీపంలో ఉండే వాణిజ్య, నివాస భవనాల సముదాయాలకు పైవంతెనల (Skywalk) నిర్మాణాన్ని ప్రోత్సహించాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి(HMRL MD Sri NVS Reddy), హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమీషనర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్(HMDA Metropolitan Commissioner Shri Sarfaraz Ahmed,) రెండు రోజుల క్రితం హెచ్ఎండిఏ స్వర్ణజయంతి భవన్ లో నిర్వహించిన కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్రణాళికా సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించబడింది.
ఇప్పటికే ఎల్ అండ్ టీ(L&T) వారు పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ల నుండి వారు అభివృద్ధి చేసే మాల్స్ కు పైవంతెనలు నిర్మించి మెట్రో ప్రయాణీకులు నేరుగా ఈ వాణిజ్య సముదాయాలకు చేరుకునే సౌలభ్యాన్ని కల్పించారు. అదే విధంగా జేబీఎస్, పెరేడ్ గ్రౌండ్ స్టేషన్ లను కలుపుతూ ప్రయాణీకులు రోడ్డు దాటే అవసరం లేకుండా స్కైవాక్ లు నిర్మించారు. రాయదుర్గ్ మెట్రో స్టేషన్(Raidurg Metro Station) నుండి రహేజా మైండ్ స్పేస్ కాంప్లెక్స్ లో 11 టవర్లలో నెలకొని ఉన్న అనేక అంతర్జాతీయ సంస్థలలో పనిచేస్తున్న వారు సులభంగా చేరుకునే విధంగా వారు ఒక అధునాతనమైన స్కైవాక్ ని అనేక సౌకర్యాలతో నిర్మించారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ ను ఉప్పల్ జంక్షన్ చుట్టూ ఉన్న అన్ని రస్తాలను కలిపే విధంగా హెచ్ఎండీఏ వారు నిర్మించిన వలయాకారపు రోటరీ స్కైవాక్ మెట్రో ప్రయాణీకులకు, ఈ కూడలి రోడ్లు దాటే పాదచారులకు బాగా ఉపయోగపడుతోంది.
వీటిని దృష్టిలో పెట్టుకుని మెట్రో స్టేషన్ల నుండి స్కైవాక్ నిర్మాణం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దీనికి వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీల నుండి ఇతర నివాస భవనాలు, వాణిజ్య సముదాయాల వారి నుండి మంచి స్పందన వస్తోందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్(Balanagar Metro Station) నుండి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్/ల్యాండ్ మార్క్ మాల్ కు ఆ సంస్థ వారే స్కైవాక్ నిర్మిస్తున్నారు. అలాగే ఎల్ బీ నగర్ స్టేషన్ నుండి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవీ ఆనందనిలయం నివాస భవనాల సముదాయానికి వాసవీ గ్రూప్ వారు స్కైవాక్ నిర్మిస్తున్నారు. వాసవీ ఆనందనిలయం కాంప్లెక్స్ మొత్తం 25 ఎకరాలలో ఒక్కొక్క టవర్ లోను 33 అంతస్తులతో మొత్తం 12 టవర్స్ నిర్మించబడుతున్నాయి. వాటిలో పెద్ద సంఖ్యలో నివసించబోతున్న అనేక కుటుంబాలకు ఈ స్కైవాక్ చక్కటి సౌకర్యం కల్పిస్తుంది. అదే విధంగా మరికొన్ని సంస్థలు నాగోల్, స్టేడియం, దుర్గం చెరువు, కూకట్ పల్లి వంటి అనేక మెట్రో స్టేషన్ల నుండి ఈ తరహా స్కైవాక్ లు నిర్మించడానికి తమతో చర్చలు జరుపుతున్నారని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ శ్రీ కేవీబీ రెడ్డి అన్నారు.
ఎవరైనా ప్రైవేట్ సంస్థలు మెట్రో స్టేషన్ల నుండి ఇటువంటి స్కైవాక్ లు నిర్మించదలిస్తే వారు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ మెట్రో రైల్ స్టేషన్ రిటైల్ అధికారి అయిన శ్రీ కె.వి. నాగేంద్ర ప్రసాద్ ను ఫోన్ నెంబర్ 9900093820 పై సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. అలాగే 69 కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) మొదటి దశకు చెందిన మొత్తం 57 స్టేషన్లలో ప్రతి స్టేషన్ యొక్క రెండు వైపులా రోడ్డుకు ఒక వైపు నుండి మరో వైపునకు చేరుకునే సౌకర్యం ఉందని, వీటిని మెట్రో ప్రయాణీకులే కాక, అన్-పెయిడ్ మార్గాలుగా ఏ పాదచారులైన వినియోగించుకోవచ్చని మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. వీటిని వినియోగించుకుని ప్రమాదాల బారిన పడకుండా రోడ్డును సురక్షితంగా దాటాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.