calender_icon.png 24 October, 2024 | 12:03 AM

జల ప్రళయం

02-09-2024 03:07:51 AM

  • కుండపోత వాన

ఖమ్మం జిల్లా కకావికలం

  1. పలుచోట్ల కొట్టుకుపోయిన రైల్వే పట్టాలు, రోడ్లు
  2. వరదతో పోటెత్తుతున్న నదులు, వాగులు
  3. పొంగుతున్న రిజర్వాయర్లు.. పలుచోట్ల గండ్లు
  4. జల దిగ్బంధంలో నివాస ప్రాంతాలు
  5. ౧౦ మంది మృతి.. ఏడుగురు గల్లంతు
  6. ఇనగుర్తిలో 2౪ గంటల్లో 44 సెంటీమీటర్ల వర్షం
  7. సహాయ చర్యలపై సీఎం, మంత్రుల సమీక్ష
  8. నేడు హెచ్‌ఎండీఏ పరిధిలో విద్యాసంస్థలు బంద్
  9. జిల్లాల్లో పరిస్థితిని బట్టి కలెక్టర్ల నిర్ణయం

రాష్ట్రంలో జలవిలయం.. ఆకాశానికి చిల్లు పడినట్లుగా రెండురోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. నదులు, వాగులు, వంకలు ఏకమై ప్రళయ గర్జన చేస్తున్నాయి. ఆనకట్టలను, అడ్డుకట్టలను, రోడ్లను, రైల్వే ట్రాక్‌లను వరదలు తుడిచిపెట్టేస్తున్నాయి. ప్రజా రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఖమ్మం జిల్లాలో పరిస్థితి చేయిదాటిపోయింది. ప్రజలు సహాయం కోసం అల్లాడున్నారు.

వరద ప్రమాదాల్లో ౧౦ మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించటంతో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఉద్యోగులు, అధికారులకు సెలవులు రద్దుచేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అన్నిరకాల విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇతర జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): వరదల దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా ౨౨౦ జలాశయాలు, కాల్వలు దెబ్బతిన్నాయి. వరద పరిస్థితిని ఆదివారం ఉదయం నుంచే సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుక్షణం సమీక్షించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులకు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు.

ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని, అధికారులు అణుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిం చారు. అనేక జిల్లాల్లో పలు గ్రామాలు, పల్లెలు, నివాస ప్రాంతాలు, కాలనీలు నీటిలో తేలుతుండటంతో బాధితులను కాపాడేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. సోమవారం కూడా చాలా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. రోడ్లు ధ్వంసం కావటంతో పలు ప్రధాన మార్గాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలు తెగిపోయాయి.

ఖమ్మం జిల్లా కన్నీరు

భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం నీటిలో చిక్కుకున్నది. ఖమ్మం పట్టణంలో అత్యధిక భూభాగంలోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. ఖమ్మం ఐటీ హబ్‌లోకి వరద నీరు చేరింది. కొత్తగూడెం జిల్లా మణుగూరులో పలు కాలనీలు నీటిలో మునిగాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసలపల్లి సమీపంలో దాదాపు 100 మీటర్ల వరకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. రైల్వే విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. మహబూబాబాద్‌లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. దీంతో వరంగల్ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దు చేయడమో.. దారి మళ్లించడమో చేస్తున్నారు.

ఖమ్మ పట్టణం 16వ డివిజన్ అగ్రహారంలో కొత్తూరు చెరువు కట్ట తెగి రైలు పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో కొత్త కాలనీ నీళ్లలో మునిగిపోయింది. మున్నేరుకు భారీ వరద రావడంతో 25 అడుగుల మేర నీరు ప్రవహిస్తూ చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. జలగం నగర్, ఆర్టీసీ కాలనీతోపాటు మున్నేరును ఆనుకుని ఉన్న కాలనీలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కవిరాజ్‌నగర్ కాలనీ, ఇల్లందు క్రాస్ రోడ్డు, జేసీ మాల్, సీఎంఆర్ షాపింగ్ మాల్, కోర్టు ఎదురు ప్రాంతం, మైసమ్మ గుడి వెనక ప్రాంతం, ఎస్సార్ కాలేజ్, నాగార్జున ఫంక్షన్ హాల్ తదితర ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తింది.

ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిందని ఆగ్రహించిన ఖమ్మం త్రీటౌన్ ప్రాంత వాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాల్వంచ మండలం ఉలవనూరు పరిధిలోని బ్రిడ్జి కొట్టుకుపోయింది. పాల్వంచ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బూర్గంపాడు మండలం ఊర్లదోసపాడులో పాలవాగు ఉధృతికి 30 పశువులు కొట్టుకుపోయాయి. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద వరదను చూసేందుకు వచ్చిన బాలుడు ఆ వరదలో కొట్టుకుపోయాడు. బన్నీ, మధు, వీరబాబు, గోపి అనే మరో నలుగురు కూడా గల్లంతైనట్లు సమాచారం. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో వరద ధాటికి భార్యాభర్తలు కొట్టుకుపోయారు. వారి కుమారుడిని అతికష్టంమీద అధికారులు కాపాడారు.

అన్ని జిల్లాలో జల ఖడ్గమే..

  1. కరీంనగర్‌లోని లోతట్టు ప్రాంతాలు ముకరంపురా, శర్మనగర్, లక్ష్మీనగర్, కిసాన్‌నగర్, మంకమ్మతోట తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. కరీంనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 
  2. వికారాబాద్ జిల్లా కొత్తగడి గ్రామంలో ఒక ఇల్లు కూలిపోయింది. హుజూరాబాద్‌లోని చిలుకల వాగు పొంగడంతో వడ్డెర కాలనీలో సుమారు 50 కుటుంబాలు బయటకు రాలేని స్థితిలో ఉన్నారు. 
  3. రాష్ట్రవ్యాప్తంగా పలు విద్యుత్ సబ్‌స్టేషన్లు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సబ్‌స్టేషన్లను డీవాటరింగ్ చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. 
  4. వరంగల్ రహదారిలో నెక్కొం డ మండలం తోపనపల్లి చెరువు పొంగడంతో వరద కట్టపై ఆర్టీసీ బస్సు నిలిచిపోయి ప్రయాణీకులు అందులోనే చిక్కుకుపోయారు. ఆదివారం ఉదయం వారిని రక్షించారు. 
  5. తాండూరు రహదారిలో నాలు గు చోట్ల రోడ్డు తెగిపోయి రవాణా నిలిచిపోయింది. 
  6. ఆదిలాబాద్‌లో పెన్‌గంగ ఉప్పొంగడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి.
  7. కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్ బైపాస్ చౌరస్తా వద్ద 44వ జాతీయ రహదారిపై బ్రిడ్జి సమీపంలో భారీ గుంత పడటంతో రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 
  8. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శ్రీకాంత్ అనే వ్యక్తి తీవ్ర చలికి ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. 
  9.  సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ భారతీ పబ్లిక్ స్కూల్ వద్ద కాల్వలోకి రెండు కార్లు కొట్టుకొచ్చాయి. ఇందులో గాంధీనగర్‌కు చెందిన రవి అనే వ్యక్తి మృతదేహం లభించింది. 
  10. పెద్దపల్లి జిల్లా మిర్జంపేట సమీపంలో వాగు దాటుతుండగా కారోబార్ సూర్య గల్లంతయ్యాడు.
  11. ఖమ్మం జిల్లా కారేపల్లి గంగారాం తాండాకు చెందిన నునావత్ మోతీలాల్, ఆయన కూతురు, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆశ్విని కారులో హైదరాబాద్‌కు వస్తుండగా మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయ్య గూడెం వద్ద వరద నీటిలో కొట్టుకుపోయారు. అశ్విని మృతదేహం లభించగా, మోతీలాల్ గల్లంతయ్యారు.
  12. షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్‌నగర్ మండలం దేవునపల్లి గ్రామంలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఎరుకల శేఖర్ గల్లంతయ్యాడు.
  13. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల మల్యాల రోడ్డుపై నక్కలవాగు వద్ద రోడ్డు దాటుతుండగా పవన్ అనే వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు.
  14. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటకు చెందిన కైరం కొండ శివరాములు అనే మత్స్యకారుడు చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు.
  15. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో ఇంటిపై నిలిచిన నీటిని తొలగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై శ్రీనివాసరావు అనే వ్యక్తి చనిపోయాడు. 
  16. షాద్‌నగర్ మండలం నోబుల్‌పార్క్ కాలనీలో ఆదివారం సాయంత్రం నీటి గుంతలోపడి ౧౩ నెలల చిన్నారి ఆరిఫ్ మృతిచెందాడు.
  17. రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకూలాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కాల్వలకు గండ్లు పడ్డాయి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కట్టకు నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం 133.06 కిలోమీటర్ వద్ద గండి పడింది. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. 
  18. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల్లో వందలాది కాలనీలు నీట మునిగాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి కూడా వరద నీరు చేరింది. బూర్గంపాడు మండలం వేపాలగడ్డ గ్రామాల మధ్య తూము వాగు కల్వర్టు కొట్టుకుపోయింది. సీతారామ ప్రాజెక్టు కాలువకు గండి పడింది.

సీఎం, మంత్రుల పర్యవేక్షణ

వరదలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, సీతక్క, పొంగులేటి, దుద్దిళ్ల, పొన్నం, కోమటిరెడ్డి, జూపల్లి తదితరులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ  అధికారులకు సూచనలు, ఆదేశాలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షిస్తూ వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సూచనలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

  1. రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో తొలగించి రాకపోకల పునరుద్ధరించేందుకు అధికారులు,  పోలీసులు కృషి శ్రమిస్తున్నారు. 
  2. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక చోట్ల రోడ్లు జలమయమ య్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. మూసీ నదిలో వదర ఉధృతి పెరుగుతుండటంతో సమీప కాలనీలవారిని అప్రమత్తం చేశారు. జంట జలాశయాలు పూర్తిగా నిండాయి. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయిలో నిండుకుంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల సంఖ్యలో విద్యుత్తు స్థంభాలు కూలాయి. ట్రాన్స్‌ఫార్మర్లపై, స్థంభాలపై చెట్లు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఎప్పటికప్పుడు సిబ్బంది విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడానికి శ్రమిస్తున్నారు.
  3. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ పరిధిలోని ఇనగుర్తిలో శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు సుమారు 44 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. 
  4. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 12 చోట్ల 27.5 సెంటీమీటర్ల నుంచి 44 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. సూర్యాపేట, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే స్థాయిలో వర్షపాతం నమోదవ్వడం గమనార్హం.
  5. జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీహెచ్‌ఈఎల్‌లో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.  జిల్లా సిరికొండ మండలం తూంపల్లి లో 19.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 
  6. కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాత కురిసింది. 

దెబ్బతిన్న 220 జలాశయాలు 

భారీ వర్షాలకు చెరువులు, కాల్వలు, ప్రాజెక్టులు, కుంటలు కలిపి మొత్తం 220 వరకు దెబ్బతిన్నాయి. 67 చెరువులకు భారీగా నష్టం వాటిల్లగా.. 98 చెరువులకు గండ్లు పడ్డాయి. 55 సాగు నీటి ప్రాజెక్టులు మరమ్మతులకు గురయ్యాయి. కొన్నింటికి తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. దెబ్బతిన్న జలశయాలకు మరమ్మతులు చేయటానికి రూ.629.70 కోట్లు అవసరమని అధికారులు లెక్కగట్టారు. తాత్కాలిక మరమ్మతులకే రూ.221.98 కోట్లు అవసర మని తేల్చారు. 52 జలాశయాలకు తాత్కాలిక/పర్మినెంట్ మరమ్మతులు పూర్తయ్యాయి. 22 చెరువులు, కుంటలకు పనులు కొనసాగుతున్నాయి. మరో 126 చెరువులు, కెనాల్స్, ప్రాజెక్టులు, కుంటలకు మరమ్మతులు చేయాల్సి ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

మరో 24 గంటలు అప్రమత్తం 

సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారు లు సూచించారు. రెండు రోజులుగా భారీ వర్షాలకు నివాసాలు నాని ఉండటంతో పాత ఇండ్లల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.  ఆదిలాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీచేసింది. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, నల్లగొండ, మహబూబా బాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లాల అధికారులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపుల తో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.