వనపర్తి, అక్టోబర్ 17 (విజయక్రాంతి): కేవలం కులాల వారీగా రెచ్చగొడుతూ, బుజ్జగిస్తూ ఓట్లు రాల్చుకునే స్టంట్ చేయడంలోనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు పరిమితమయ్యారని.. గడిచిన ఐదేండ్లలో ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందని ఏమీలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీరుపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విమర్శించారు. వాల్మీకీ జయంతి సందర్భంగా పట్టణంలోని వివేకానంద చౌరస్తా పక్కన గల ఖాళీ స్థలంలో వాల్మీకీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐదేండ్లుగా కేవలం టెంకాయలు కొట్టుడు, ఫ్లెక్సీలు కట్టుడుకే బీఆర్ఎస్ నేతలు పరిమితం అయ్యారని మండిపడ్డారు. వాల్మీకీలు ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని అర్ధరాత్రి చెత్త బండిలో తరలించారని విరుచుకుపడ్డారు. ఓట్లు రాబట్టుకోవడాని కాంస్య విగ్రహం పేరుతో కళ్లబొల్లి కథలు చెప్తున్నారని ఆరోపించారు. గత కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన కేఎల్ఐ కాల్వలకు గండ్లు పెట్టి.. తానే నీళ్లు తెచ్చానంటూ గొప్పలు చెప్పుకొన్నారని విమర్శించారు. వనపర్తి అభివృద్దిపై దమ్ముంటే చర్చకు రావాలని.. తాను ఎక్కడికైనా వచ్చేందుకు సిద్దమేనంటూ సవాల్ విసిరారు.