22-04-2025 12:14:43 AM
ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయని, కొన్ని విషయాల్లో ఈసీ రాజీపడుతున్నట్లు కనిపిస్తున్నదని ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని బోస్టన్లో సోమవారం ఎన్ఆర్ఐలతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. ఈసీ కొన్ని విషయాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నదని ఆరోపించారు. అందుకు ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. అక్కడి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల మధ్య అక్కడ 65 లక్షల మధ్య ఓట్లు పోల్ అయ్యాయని, ఈ విషయాన్ని స్వయంగా ఈసీనే వెల్లడించిందని గుర్తుచేశారు. కేవలం రెండు గంటల్లో అంత పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదుకావడం సాధారణ విషయం కాదని, ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి కనీసం మూడు నిమిషాల సమయం పడుతుందని స్పష్టం చేశారు. మరి అతి తక్కువ వ్యవధిలో లక్షలాది మంది ఓటు వేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తాము ఓటింగ్కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ చూపించాలని ఈసీని కోరామని, కానీ.. తమ విజ్ఞాపనను ఈసీ తిరస్కరించిందని వాపోయారు.