18-02-2025 12:00:00 AM
మేడ్చల్, ఫిబ్రవరి 17(విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన గుగులోతు ఉమేష్ (25) హత్య కేసును పోలీసులు చేదించారు. రోడ్డుమీద ఇద్దరే కత్తులతో పొడుచినప్పటికీ, ఇందులో మొత్తం ఐదుగురు పాత్ర ఉందని పోలీసుల విచారణలో తేలింది. అంతేగాక పథకం ప్రకారమే హత్య జరిగినట్లు తెలుస్తోంది.
కేసు వివరాలను డీసీపీ కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారం పేట కు చెందిన గుగులోతు ఉమేష్ మేడ్చల్ ఆర్టీసీ కాలనీ లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే తాగుడుకు బానిస అయినా గుగులోతు ఉమేష్ నిరంతరం తాగి కుటుంబ సభ్యులను వేధించేవాడని,
అయితే ఆయన వేధింపులను తాళలేక మృతుడి సొంత తమ్ముడు రాకేష్, చిన్నన్న కుమారుడు గుగులోతు లక్ష్మణ్, బంధువులు భూక్య నవీన్, భూక్య సురేష్, భూక్య నరేష్ ల సహకారం తీసుకొని గుగులోతు ఉమేష్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా కత్తులను తీసుకొని గుగులోతు ఉమేష్ ఇంటికి వెళ్లారు.
అప్పటికే మద్యం మత్తులో కుటుం బ సభ్యులను వేధిస్తుండడం చూసి భూక్య నవీన్, సురేష్ మృతుడు గూగులోతు ఉమేష్ ను గట్టిగా పట్టుకోగా గుగులోతు రాకేష్, గూగు లోతు లక్ష్మణ్ కత్తులతో పొడి చేందుకు ప్రయత్నం చేయగా మృతుడు ఉమేష్ తప్పించుకొని పారిపోతుండగా వెంటపడి మేడ్చల్ బస్ స్టాండ్ సమీపంలోని ఎన్ హెచ్ 44 జాతీయ రహదారి పైన రాకేష్, గుగులోతు లక్ష్మణులు విచక్షణ రహితంగా కత్తులతో పొడవడంతో ఉమేష్ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.
ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటు రెండు మోటార్ సైకిళ్లను, నిందితులు ఉపయోగించిన కత్తులను, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.