12-02-2025 10:43:57 PM
రాజకీయ నేతల అండదండలతో చెరువులు, నాలాలు కబ్జా..
పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్..
చంపాపేట, హస్తినాపురం డివిజన్లలో పర్యటన..
ఎల్బీనగర్: పదేళ్ల కాలంలో కొందరు రాజకీయ నేతలు అండదండలతో ఎల్బీనగర్ లోని చెరువులు, కుంటలు కబ్జాలకు గురయ్యాయని, హైడ్రాకు ఫిర్యాదు చేసి కబ్జాలను తొలిగిస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు.
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో కలిసి మధుయాష్కీ గౌడ్ బుధవారం చంపాపేట డివిజన్లలోని ఉదయ నగర్, పద్మా నగర్, సూర్యనగర్, సామ సరస్వతి కాలనీల్లో పర్యటించారు. వరద నీటి నాలా పనులు నిలిచిపోయిన నేపథ్యంలో నాలాను పరిశీలించారు. నాలా పనులకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు. కాలనీవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను జోనల్ కమిషనర్ కు వివరించారు.
ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. నాలాలు, చెరువుల ఆక్రమణకు నిదర్శనం హస్తినాపురంలోని చేపల చెరువు అన్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేసి ఆక్రమణలను తొలిగిస్తామన్నారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న నాలా నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని, వచ్చే వర్షాకాలం లోపు వరద సమస్య లేకుండా చూస్తామన్నారు.
ఒక ఫంక్షన్ హాల్ ను నాలాను ఆక్రమించి పార్కింగ్ కోసం చేపట్టిన నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్, ఈఈ కార్తీక్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రతాప్ పాల్గొన్నారు.
హస్తినాపురం డివిజన్ లో పర్యటన...
హస్తినాపురం డివిజన్ లోని వందనపురి కాలనీ, సాగర్ ఎంక్లేవ్, రెడ్డి కాలనీల్లో కార్పొరేటర్ సుజాత నాయక్, మధుయాష్కీగౌడ్ పర్యటించారు. ఆయా కాలనీల్లో స్థానికులు ఎదుర్కొంటున్న వరద సమస్యలను తెలుసుకున్నారు. రెడ్డికాలనీలో ఏర్పాటు చేసిన జిమ్ ను ప్రారంభించారు.
వందనపురి కాలనీ, సాగర్ ఎంక్లేవ్, రెడ్డి కాలనీల్లో వరద సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.