calender_icon.png 22 October, 2024 | 12:28 AM

మహారాష్ట్రలో బీజేపీ తొలి జాబితా విడుదల

21-10-2024 12:00:00 AM

  1. 99 మంది పేర్లతో ప్రకటన
  2. బరిలో ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు 

ముంబై, అక్టోబర్ 20: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. శనివారం జార్ఖండ్‌లో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ.. ఆదివారం మహారాష్ట్రలోనూ ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా 99 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

ఈ జాబితాలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు. నాగ్‌పూర్ సౌత్‌వెస్ట్ నుంచి పోటీ చేయనున్నారు. కామఠీ సెగ్మెంట్ నుంచి మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే, భోకార్ నుంచి మాజీ సీఎం అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ బరిలోకి దిగారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి శ్రీజయ చవాన్ చేరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ వర్గం)తో కలిసి కూటమిగా బీజేపీ పోటీ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా 151 సీట్లలో కమల దళం పోటీ చేయనుంది. మిగతా సీట్లలో శివసనే, ఎన్సీపీ పోటీ చేస్తాయి.