- బాయిలర్ పేలడంతో ఐదుగురికి గాయాలు
- పాశమైలారం పారిశ్రామికవాడలో ఘటన
పటాన్చెరు, జూలై 27: పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని విరూపాక్ష ఆర్గానిక్స్ యూనిట్ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బీడీఎల్ భానూర్ సీఐ స్వామిగౌడ్, స్థానికుల కథనం ప్రకారం.. విరూపాక్ష పరిశ్రమలోని బాయిలర్ వద్ద చార్కోల్ తీస్తున్న సమయంలో రిపేర్ వచ్చింది. మరమ్మతులు చేయించేందుకు సిబ్బంది కోసం అక్కడ పనిచేస్తున్న కార్మికులు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా బాయిలర్ పేలింది.
సమీపంలో విధులు నిర్వహిస్తున్న శంకర్పల్లికి చెందిన స్టోర్ మేనేజర్ అనంతరెడ్డి, ఇంద్రేశం గ్రామానికి చెందిన అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్, కిష్టారెడ్డిపేటకు చెందిన క్వాలిటీ మేనేజర్ హరిప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గణేశ్, దీపక్ అనే ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. సమీపంలో ఉన్న పరిశ్రమ జీఎం రాజమౌళికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ధాటికి బ్లాక్లోని రేకులు ఎగిరిపోయాయి. మంటలను ఆర్పేందుకు పాశమైలారం, పటాన్చెరు నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చాయి. సీఐ స్వామిగౌడ్ సిబ్బందితో వచ్చి పరిశ్రమ వద్ద పరిస్థితిని సమీక్షించారు.