01-04-2025 02:10:57 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): చర్లపల్లి పారిశ్రామికవాడలో బీఎన్ రెడ్డి నగర్ లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్లితే.. ప్లాస్టిక్ డబ్బాల తయారీ కంపెనీలో డబ్బాలకు పెయింటింగ్ వేస్తుండగా పెయింటింగ్ మోటారు నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఆ గదిలోని పెయింటింగ్ డబ్బాలు మొత్తం కలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో కూలీలు టీ తాగేందుకు బయటకి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, దాదాపు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని చర్లపల్లి ఇన్ స్పెక్టర్ బీ.రవి కుమార్ తెలిపారు.