పెరూ (లిమా): ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్ టోర్నీని భారత్ అగ్రస్థానంతో ముగించింది. ఆఖరిరోజైన ఆదివారం కూడా మన షూటర్లు పతకాలతో సత్తా చాటారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో దీపక్ దలాల్, కమల్జీత్, రాజ్ చంద్రలతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది.
50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఈ త్రయం 1616 పాయింట్లు సాధించి పసిడి సొంతం చేసుకోగా.. పోటీలో దీపక్ (545 పాయింట్లు), కమల్ (543 పాయింట్లు), రాజ్ (528 పాయింట్లు) స్కోర్లు నమోదు చేశారు. ఇక అజర్బైజాన్ (1615 పాయింట్లు), ఆర్మేనియా (1612 పాయింట్లు) షూటర్లు రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.
వ్యక్తిగత ఈవెంట్లో భారత షూటర్ ముకేశ్ నెలవల్లి కాంస్యంతో మెరవగా.. జూనియర్ మహిళల 50 మీ విభాగంలో పరిశా గుప్తా (540 పాయింట్లు) రజతం నెగ్గింది. మొత్తంగా టోర్నీలో 24 పతకాలు సొంతం చేసుకున్న భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, మూడు రజతాలు, 8 కాంస్యాలున్నాయి. తొలి స్థానంలో భారత్ నిలవగా.. ఇటలీ, నార్వే రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.