01-04-2025 01:49:15 PM
డీసీసీ అధ్యక్షురాలు సురేఖ
మంచిర్యాల,(విజయక్రాంతి): పేదవారికి సన్న బియ్యంతో పట్టెడన్నం పెట్టాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన గొప్పదని, తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభించామని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళ వారం ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఇది చరిత్రలో, పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే పథకం అని అన్నారు. ప్రతి పేదవారి ఇంట ప్రతి రోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, పాత మంచిర్యాల ప్రజలు పాల్గొన్నారు.