13 నెలలుగా కుల బహిష్కరణ, చర్యలు తీసుకోవాలని తండ్రి కొడుకుల డిమాండ్
కామారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): బంధువులతో గొడవ పడిన పాపానికి కులస్తులు పంచాయితీ నిర్వహించి ఐదు వేల జరిమానా విధించారు. తమ తప్పు లేదని జరిమానా ఎందుకు చెల్లించాలని అడిగిన పాపానికి కుల బహిష్కరణ చేసిన ఉద0తం కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి రామ్ రెడ్డి తన కొడుకు ప్రకాశ్ రెడ్డి తో కలిసి తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కులస్తులంతా ఒకటై తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జరిమాన విధించిన డబ్బులు చెల్లించ నందుకు 2023 డిసెంబర్ నెలలో రెడ్డి సంఘ భవనంలో పంచాయతీ పెట్టారు. కులస్తులు పెట్టిన పంచాయతీకి తాము వెళ్లక పోవడంతో తమ మాటను ధిక్కరించారని రూ. 5వేలు కట్టాలని కుల పెద్దలు పేర్కొనడంతో తమకు చెల్లించే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో నిరాకరించినట్లు వారు తెలిపారు.
దీంతో తమ కుటుంబాన్ని బహిష్కరించి గత 13 నెలలుగా కులస్తుల్లోని ఎవరి కుటుంబంలో శుభకార్యాలు జరిగిన అపకార్యాలు జరిగిన తమకు పిలవడం లేదన్నారు. తమను కుల బహిష్కరణ చేసిన వారిపై తాడువాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు.
పోలీసు అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేకుంటే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వారు ఆవేదనతో తెలిపారు.