calender_icon.png 24 September, 2024 | 7:56 PM

అభాగ్యులకు ఆర్థిక చేయూత

24-09-2024 05:18:37 PM

సూర్యాపేట, (విజయక్రాంతి):  గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తల్లిదండ్రులతో పాటు సర్వం కోల్పోయిన అన్నదమ్ములకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆనంద్ విద్యామందిర్ ఉన్నత పాఠశాల (మిషనరీ స్కూల్) ప్రధానోపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ ఫాతిమా రూ. 50 వేలను ఆర్ధిక సాయంగా అందజేశారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా పాలేరులో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి యాకూబ్ సైడాబీ దంపతులకు ఇద్దరు కుమారులు ఎండి యూసుఫ్, షరీఫ్ ఉన్నారు.

అనుకోకుండా వచ్చిన భారీ వర్షం వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వరదలో అన్నదమ్ముల తలిదండ్రులతో పాటు సర్వస్వాన్ని కోల్పోవడాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని చలించిపోయిన సిస్టర్ ఫాతిమా వెంటనే తమ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల నుండి రూ.50 వేలను వసూలు చేసి మంగళవారం షరీఫ్ కు విద్యార్థుల చేత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాతలు తమ వంతుగా అభాగ్యులకు చేయూత ఇవ్వాలని కోరారు.