26-03-2025 12:54:29 AM
అనుమానాస్పదస్థితిలో 15 రోజుల పసికందు మృతి
బకెట్లో తలకిందులుగా మృతదేహం
అలీనగర్ వర్కర్స్ కాలనీలో ఘటన
రాజేంద్రనగర్, మార్చి 25: అనుమానాస్పద స్థితిలో 15 రోజుల పసికందు మృతిచెందిన ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. తమిళనాడుకు చెందిన దంపతులు ముడలి మణి, ఆరోజియా విజి నాలుగేళ్ల క్రితం వలస వచ్చి అలీనగర్ వర్కర్స్ కాలనీలో అద్దెకు ఉంటూ స్థానిక బిస్కెట్ కంపెనీలో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారు. వీరికి ఇప్పటికే ఏడాది కొడుకు ఉన్నాడు. 13 రోజుల క్రితం అరోజియా విజి మరో పాపకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా, మంగళవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు అరోజియా విజి తన 15 రోజుల పాపను మంచంపై పడుకోబెట్టి స్నానానికి వెళ్లింది.
10 నిమిషాల తర్వాత వచ్చి చూడగా పాప కనిపించలేదు. ఒక్కసారిగా ఆమె ఆందోళనకు గురై రోదించసాగింది. స్థానికుల సాయంతో ఇంటి పరిసరాల్లో వెతుకగా ఓ బకెట్లో తలకిందులుగా కనిపించింది. బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది. చిన్నారి మృతిని తట్టుకోలేక తల్లి గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.