జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో మహిళ ఎస్ఐ శ్వేత మృతి(Female SI Shweta Dies) చెందిన ఘటన గొల్లపల్లి మండలం చిల్వ కోడూర్ గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్వేత కారలో ధర్మారం వైపు నుంచి జగిత్యాల వస్తుండగా చిల్వాకోడూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ను ఆమె కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ద్విచక్రవాహన దారుడు, ఎస్ఐ శ్వేత సంఘటన స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనదారుడు ముత్యంపేట వాసిగా, ధర్మారం మండల కేంద్రంలోని గాయత్రి బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన గొల్లపల్లి ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఎస్ఐ శ్వేత మృతి పట్ల జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీసీఆర్బీ నేరవిభాగంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్వేత గతంలో వెల్లటూరు, కథలాపూర్, కోరుట్ల, పెగడపల్లిలో ఎస్ఐగా పని చేశారు.