22-02-2025 12:00:00 AM
జనగామ/హనుమకొండ, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా కమి టీ మెంబర్, కొసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని శుక్రవారం వరంగల్ సీపీ అంబ ర్ కిశోర్ ఝా ఎదుటు లొంగిపోయా రు. ఈ సందర్భంగా సీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
చత్తీస్గఢ్ రాష్ర్టం బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం రాసపల్లి గ్రామానికి చెందిన వంజెం కేషా బాల్యంలో చైతన్య నాట్య మండలిలో పనిచేశారు. ఆమె తండ్రి మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మావోయిస్టులతో పరిచయాలు ఉండడంతో కేషా 2017లో మావోయిస్టుగా మారిపోయారు. రెండేళ్లు చైతన్య నాట్య మండలిలో పనిచేయగా పార్టీ నాయకత్వం అబుజ్మడ్ ప్రాంతానికి బదిలీ చేసింది.
అక్కడ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్య నారాయణరెడ్డికి ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా పనిచేశారు. 2021లో ఏరియా కమిటీ మెంబర్గా, 2022 డిసెంబర్ వరకు ప్రొటెక్షన్ గ్రూపు మెంబర్గా, 2024 ఏప్రిల్లో తిరిగి కొసా ప్రొటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
పోలీసులపై పలుమార్లు మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో కేషా పాల్గొన్నారు. ఆమెపై ప్రభుత్వం రూ.4 లక్షల రివార్డు ప్రకటించింది. ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితురాలై ఆమె పోలీసులకు లొంగిపోయినట్లు సీపీ వెల్లడించారు.