18-03-2025 12:25:23 AM
దర్జాగా పరదాలు కట్టి మళ్లీ పనులు..?
రూల్స్కు మంగళం..
పట్టించుకునే నాథుడు కరువు
రాజేంద్రనగర్, మార్చి 17 (విజయక్రాంతి ): అక్రమార్కులు అదరడం లేదు... బెదరడం లేదు. తమను అడిగేవాడు లేడంటూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. దర్జాగా నిబంధనలు పట్టించుకోకుండా తమ పని కానించుకొని ముందుకు వెళ్తున్నారు. వారిని అడిగే వారే లేకుండా పోయారు.
శనివారం మణికొండ మున్సిపల్ పరిధిలోని మర్రిచెట్టు సమీపంలో ఎంతో చరిత్ర ఉన్న బుల్కాపూర్ నాలా పై వెలసిన రేకుల ప్రహరీని హైడ్రా అధికారులు కూల్చివేశారు. అదే విధంగా హై టెన్షన్ వైర్ల కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నిబంధనలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఓ నిర్మాణ సంస్థ మంగళం పాడింది. దర్జాగా నిర్మాణాలు చేపట్టింది.
వరదాల మాటున అక్రమాలు
మూడు రోజుల క్రితం హైడ్రా అధికారులు కూల్చివేసిన కూడా అక్రమార్కులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దర్జాగా కూల్చివేసిన చోటనే ప్రధాన రహదారికి కనిపించకుండా పరదాలు ఏర్పాటు చేసుకొని తమ కార్యకలాపాలు కానిస్తున్నారు.
మర్రిచెట్టు సమీపంలో ఆర్టిఏ కార్యాలయానికి వెళ్లే రహదారిపై ఎడమవైపున ఓ బడా నిర్మాణ సంస్థ అడ్డగోలుగా వ్యవహరిస్తుందని స్థానికులు కొన్ని రోజుల క్రితం హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే అక్రమార్కులు ఏమాత్రం పట్టించుకోకుండా పరదాలు కట్టి కార్యకలాపాలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవా ల్సిన స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.