22-03-2025 12:01:07 PM
రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి
పండుగ మాసంలో కుటుంబంలో విషాద ఛాయలు
కరీంనగర్,(విజయక్రాంతి): రంజాన్ పండుగ మాసంలో ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతిలో శంకరపట్నం మండలం మక్త గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన శుక్రవారం మధ్యాహ్నం కేశవపట్నం బస్టాండ్ సమీపంలోని కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... శంకరపట్నం మండలం మక్త గ్రామానికి చెందిన ఎస్.కె అజీమ్ (38) దిచక్ర వాహనంపై తన కుమారుడు ఎస్.కె రెహమాన్ (13)తో వెళ్తుండగా ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎస్.కె అజీమ్ తో పాటు బాలుడు ఎస్.కె రెహమాన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ పులి వెంకట్, ఎస్పె కొత్తపల్లి రవిలు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా పవిత్ర రంజాన్ పండుగ సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో తండ్రి, కొడుకు మృతితో తీవ్ర విషాదం నింపింది. ఇద్దరి మృతిని జీర్ణించుకోలేక ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.