08-04-2025 12:34:48 AM
పంటల మార్పిడి విధానం అమలుపై రైతులు దృష్టి సారించాలి
లంకాసాగర్ ప్రాజెక్ట్ కట్టపై బైక్ పై ప్రయాణించి క్షేత్రస్ధాయిలో నీటి లెవల్స్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, ఏప్రిల్ - 7 (విజయక్రాంతి):- రైతులకు ఎలాంటి వాతావరణ పరిస్ధితుల ప్రభావం వలన ఇబ్బందులు కలుగకుండా పంటకు లాభాలు పెంచడమే లక్ష్యంగా యంత్రాంగం సమన్వయంతో ముందస్తు కార్యచరణ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమ వారం జిల్లా కలెక్టర్, పెనుబల్లి మండలంలో పర్యటించారు. పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలోని లంకాసాగర్ చిన్న తరహా ప్రాజెక్ట్ ను రైతులు, అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
లంకాసాగర్ ప్రాజెక్ట్ కట్టపై కలెక్టర్, బైక్పై ప్రయాణించి క్షేత్రస్ధాయిలో నీటి లెవల్స్ ను పర్యవేక్షించారు. రైతులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వాస్తవ పరిస్ధితులను, వారి సమస్యలను అడి గి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఇంతవరకు సిల్ట్ తొలగించలేదని సిల్ట్ తొలగిస్తే వాటర్ స్టోరేజ్ పెరుగుతుందని రైతులు కలెక్టర్ కు వివరించారు. లంకాసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనలు తనకు పంపాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అదేశించారు.
రైతులు పంట మార్పిడి పద్దతిని అలవార్చుకోవాలని లాభాలు వచ్చే పంటలపై దష్టి సారించాలన్నారు. లంకాసాగర్ ప్రాజెక్ట్ వద్ద టూరిజం అభివృద్ధి కి సాధ్యాసాధ్యాలు అంచనా వేస్తామని తెలిపారు.రైతులతో వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతూ ప్రత్యామ్నాయ పంటలపై సమాచారం అందిస్తూ వారిలో నమ్మకం పెంచాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమం లో కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, తహసీల్దార్ గంటా ప్రతాప్, ఎంపిడిఒ అన్నపూర్ణ, సంబంధిత తదితరులు పాల్గొన్నారు.