calender_icon.png 19 April, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతిపై రైతులకు అవగాహన ఉండాలి

18-04-2025 12:00:00 AM

  1. కలెక్టర్ కుమార్ దీపక్

నూతన ఆర్వోఆర్ చట్టంపై రైతులతో అవగాహన సదస్సు 

హాజీపూర్ (మంచిర్యాల), ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో పొందుపరిచిన అంశాలను రైతు లు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డె న్స్‌లో భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, తహశిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్పాండే లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ. ఆర్. చట్టం ద్వారా హక్కులు, రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్, ముటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు.

భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా ముటేషన్ చేసి రికార్డులో నమోదు చేయడం జరుగుతుందని, పాసు పుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, భూధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వర్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం వంటి అంశాలను పొందు పర్చడం జరిగిందని తెలిపారు.

భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక మండలాన్ని ఎంపిక చేసి మండలంలోని అన్ని రకాల సమస్యలను తెలుసుకొని నిర్ణీత గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని, సంబంధిత పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలలో సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ఇందు కొరకు కార్యచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. 

దరఖాస్తులు స్వీకరిస్తాం..

ఎంపిక చేసిన మండలంలో జూన్ 2వ తేదీ వరకు సమస్యల పరిష్కరించి, మిగిలిన మండలాలలోని సమస్యలను గుర్తించి ఆగస్టు 15వ తేదీ లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, సర్వే ప్రక్రియలో సంబంధిత సర్వేయర్లు, ఇతర అధికారుల నియామకంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

గ్రామస్థాయిలోని సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని, రైతులకు పట్టాభూమి, లావుని పట్టా, ఇతర రకాల భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ ఆదేశాలు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, టైటిల్, పొసెషన్ సంబంధిత సమస్యలు, కోర్టులో కొనసాగుతున్న కేసులను మినహాయించి మిగిలిన వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతర ఆర్.ఓ.ఆర్. చట్టంలో పొందుపరిచిన అంశాలను రైతు ప్రయోజనం దిశగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతకు ముందు మండలంలోని ర్యాలీ గడ్పూర్ గ్రామంలో నవోదయ పాఠశాల ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.