ఫార్మా విలేజ్ కు వ్యతిరేకంగా ఆందోళన
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాలో ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా విలేజ్ కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడి కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. స్థానికుల దాడిలో మండల అధ్యక్షుడు ఆవిటి శేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఫార్మా విలేజ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు దాడి చేశారు. రోటిబండతండా పంచాయతీ భవనంలోకి ఆవిటి శేఖర్ ను తరలించారు. పంచాయతీ భవనంలో ఉన్న శేఖర్ పై దాడికి నిరసనకారులు ప్రయత్నించారు. పంచాయతీ భవనం వద్ద పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల లాఠీచార్జిలో పలువురు స్థానికులు గాయపడ్డారు. ఫార్మా విలేజ్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. స్థానికుల ఆందోళనతో ఫార్మా విలేజ్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. ఉద్రిక్త పరిస్థితులతో అదనపు కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేశారు.