30-04-2025 12:00:00 AM
అధికారులు పట్టించుకోవడంలేదని రైతుల ఆగ్రహం
కల్వకుర్తి ఏప్రిల్ 29 :రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో అధికారులు మిల్లర్లు కుమ్మక్కయ్యారని తద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామని నిరసిస్తూ మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రధాన రహదారిపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసేందుకు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని రోడ్డుపై పారబోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద గోన సంచులు తాట్పాళ్ళు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మిల్లర్ల వద్ద తీసుకువెళ్లినా కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు.
దళార్లు తీసుకువచ్చిన ధాన్యాన్ని మాత్రం నాణ్యత లేకపోయినా సేకరిస్తున్నారని రైతుల తీసుకొచ్చిన ధాన్యాన్ని మాత్రం నాణ్యతగా ఉన్నా తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి వరి కొనుగోలు కొర్రీలు పెట్టకుండా సేకరించాలని కల్వకుర్తి రైతు సంఘం అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.