calender_icon.png 4 October, 2024 | 10:34 AM

రైతులకు ఇబ్బందులు వద్దు

04-10-2024 02:20:14 AM

48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ 

ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికి కాల్‌సెంటర్

కేంద్రాల్లో కొనుగోలు చేసిన వడ్ల సంచులపై నంబర్ కేటాయింపు 

డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ 5వ తేదీలోపు పూర్తవ్వాలి 

ధాన్యం కొనుగోలు, డీఎస్సీపై కలెక్టర్లు, ఎస్పీలతో  సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): గత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులిచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పారు. ఇప్పటికే రైతులకిచ్చిన మాట ప్రకారం రాష్ర్ట ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్పీకి అదనంగా ఒక్కో క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, ఏర్పాట్లు, డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్, అపాయింట్‌మెంట్ ఆర్డర్ల ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

సమావేశంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల నుంచి ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సివిల్ సప్లయీస్ ఎండీ డీఎస్ చౌహన్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునం దన్‌రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. 

అవసరమైన చోట కొత్త కేంద్రాలు..

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ర్టవ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పినట్లు సీఎం ప్రకటించారు. ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా.. ఎక్కడైనా కొనుగోలు కేంద్రం అవసరమని కలెక్టర్లు భావిస్తే కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలని సీంఎం ఆదేశించారు. రాష్ర్టంలో ఈ వానకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం చెప్పారు. 

తప్పులు జరుగొద్దు   

సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కావటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సన్న వడ్ల సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలు, లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వే రు కాంటాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సూచించారు. సన్న వడ్ల సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్‌మా ల్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

వడ్ల సంచులపై ప్రత్యేక నంబర్లు..

ప్రతి కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించాలని, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నెంబర్ తప్పకుండా వేయాలని సీఎం సూచించారు. దీంతో ఏ తప్పు జరిగినా, ఏ దశలో గోల్ మాల్ జరిగినా ఆ నంబర్ సహాయంతో సులభంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ర్టంలోకి రాకుండా కట్టడి చేయాలని పోలీసులను అప్రమత్తం చేశారు.

తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించవద్దని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం చెప్పారు. రైతులు ఎక్కడ కూడా దోపిడీకి గురి కాకూడదని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలని కోరారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని అధికారులు సీఎం ఆదేశించారు.

ప్రతి రోజు కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి కేంద్రాలను పరిశీ లించాలని ఆదేశించారు. పాత పది జిల్లాలకు నియమించిన ప్రత్యేకాధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలుంటే ఏ రోజుకారోజు పరిష్కరించాలని, సివిల్ సప్లాయీస్ విభాగంలో 24బై7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. 

డీఫాల్ట్ లేని మిల్లర్లకే ధాన్యం..

ఈ ఏడాది రాష్ర్టంలో వరిసాగు విస్తీర్ణంలో 58 శాతం సన్నరకాలు సాగయ్యా యని, ప్రభుత్వమిస్తున్న ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుంచి సన్నాల దిగుబడి మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమంగా రాష్ర్టంలో వంద శాతం సన్న వడ్లే పండించే రోజులు వస్తాయన్నారు.

జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లోనూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చే విషయంలోనూ కలెక్టర్లు నిబంధనలను పాటించాలని సూచించారు. డిఫాల్ట్ లేని మిల్లర్లకు ధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

9,090 మంది డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన..

అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మొత్తం 11,062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగలోపు నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇప్పటికే 9,090 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తుందని విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారు.