గజ్వేల్, జూలై 10: రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) వల్ల గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా 4,750 ఎకరాల భూములను కోల్పోతున్నామని, అలైన్మెంట్ మార్చి తమకు న్యాయం చేయాలని ఆర్ఆర్ఆర్ బాధిత గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రింగ్ రోడ్డు పేరుతో వ్యవసాయ భూములు లాక్కున్నారని, ఇప్పుడు ఉన్న కొద్దిపాటి భూములను ఆర్ఆర్ఆర్ పేరుతో లాక్కుంటే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.