22-04-2025 07:06:43 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
చెన్నూర్ (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. మంగళవారం జిల్లాలోని కోటపల్లి, భీమారం మండల కేంద్రాల్లోని రైతు వేదికలలో భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, భీమారం తహశిల్దార్ సదానందం, కోటపల్లి తహశిల్దార్ రాఘవేందర్ లతో కలిసి నిర్వహించిన అవగాహన సదస్సులలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
చట్టంలోని ప్రతి అంశాన్ని, ప్రతి హక్కును రైతులు పూర్తిగా తెలుసుకోవాలని, హక్కులు, రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్, ముటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు.
పాసు పుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, భూధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వర్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం వంటి అంశాలను పొందు పర్చడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో పొందుపరిచిన అంశాలను రైతు ప్రయోజనం దిశగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్, కోటపల్లి ఎంపీడీవో లక్ష్మయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.