29-04-2025 12:36:26 AM
జగిత్యాల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆధ్వర్యంలో సోమవారం భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకమైందని, రైతులు దీనిపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. పారదర్శకత, జవాబుదారీ తనంతో పని చేసేలా ఈ చట్టాన్ని రూపొందించిందన్నారు. భూ భారతి చట్టం ద్వారా పక్కాగా భూ సరిహద్దులు నిర్ణయిస్తారని, రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయ స్థానం అందుబాటులో ఉంటుందన్నారు.
ఈ చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్లపై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. వారసత్వం, వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ విచారణ జరిపి రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత గడువు 30 రోజుల లోగా మ్యూటేషన్ పూర్తి చేయకుంటే ఆటోమేటిగ్గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు.
భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. భూముల విస్తీర్ణం మార్పులు చేర్పులకు అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు, భూమికి భూ దార్ కార్డు అందించడం జరుగుతుందన్నారు.
భూ భారతిలో సులభమైన మోడల్స్ ఉండి సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశముందని, తహసిల్దార్ నుండి సీసీఎల్ఏ వరకు అప్పీల్ వ్యవస్థ వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. పెండింగ్ సాదా బైనామాల పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్ సత్యప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, మేడిపల్లి తహసీల్దార్ వసంత, ఎంపీడీవో, రైతులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.